© 2026 nimisham.in

పొరుగు దేశం నేపాల్లో హిమ సరస్సుల ఆకస్మిక ఉప్పెన (గ్లేసియల్ లేక్ ఔట్బరస్ట్ ఫ్లడ్) సృష్టించిన పెను విషాదం నేపథ్యంలో సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
రాష్ట్రంలో ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్న 40 హిమ సరస్సులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గుర్తించింది. వీటిలో ఏడు సరస్సులను 'అత్యంత ప్రమాదకర' జాబితాలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించి, ముందస్తు నివారణ చర్యలపై దృష్టి సారించింది.ఈ ప్రమాదకర సరస్సులలో కొన్ని సముద్ర మట్టానికి సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి గట్టు తెంచుకున్నా భారీ విపత్తు సంభవించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ తాంబే మాట్లాడుతూ, కొన్ని సరస్సులపై ఇప్పటికే శాస్త్రీయ అధ్యయనం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సరస్సుల లోతు, నీటి నిల్వ సామర్థ్యం, మంచు కురిసే విధానం, కొండచరియలు విరిగిపడే ముప్పు వంటి అంశాలను నిపుణులు అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు.ఆగస్టు 26న నేపాల్లో హిమ సరస్సు విచ్ఛిన్నం కావడం వల్ల సంభవించిన వరదల్లో ఇప్పటికే 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4,000 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో సిక్కింలో అటువంటి విపత్తు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.